రాయలసీమలో పొలం దున్నుతుంటే వజ్రాలు దొరుకుతున్నాయి. కర్నూల్ జిల్లాలో రైతులకు నెల రోజుల వ్యవధిలోనే ఐదు కోట్ల విలువైన వజ్రాలు దొరికాయి. ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో వజ్రాల వేట జోరుగా కొనసాగుతుంది. తుగ్గలి మండలం జొన్నగిరి లో పొలం పనులు చేస్తున్న సమయంలో రైతులకు అత్యంత విలువైన వజ్రాలు లభ్యమవుతున్నాయి.
నాగరాజు అనే వ్యక్తి పొలంలో విత్తనాలు వేస్తుండగా విలువైన వజ్రం దొరికింది. దీన్ని ఓ వజ్రాల వ్యాపారి 3 లక్షల రూపాయలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో 12 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 5 కోట్ల విలువైన వజ్రాలు దొరికినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో రైతులు ప్రతి సవంత్సరం వర్షాకాల సమయంలో పంటలు వేస్తూ వజ్రాల కోసం వెతుకుతుంటారు.
అయితే, అమాయకులైన రైతుల నుంచి అత్యంత విలువైన వజ్రాలను గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు చౌకగా కొనుగోలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.