నిండా పదేళ్లు లేని పిల్లవాడు తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచాడు. 8 ఏళ్ల వయసులో పెద్ద కొడుకుగా అంధులైన తల్లిదండ్రులు మరియు ఇద్దరు తమ్ముళ్ల మంచిచెడ్డలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి రేవతి దంపతులకు ముగ్గురు సంతానం. వారి పేర్లు గోపాలకృష్ణారెడ్డి, హిమవంతురెడ్డి, గణపతిరెడ్డి. చిన్న వయస్సు లోనే పాపిరెడ్డి తన కంటిచూపును కోల్పోయాడు. మరోవైపు రేవతి పుట్టుకతోనే అంధురాలు. దీంతో వారి కుటుంబం ప్రభుత్వం ఇచ్చే చెరొక 3000 వికలాంగుల పింఛన్ పై ఆధారపడాల్సి వస్తుంది.
పిల్లలు పెరుగుతూ ఉండటంతో పెన్షన్ డబ్బులు సరిపోక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబానికి ఆసరాగా ఉంటుందని పాపిరెడ్డి ఉప్పు, పప్పు దినుసుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే చూపు లేకపోవడంతో ఊరూరా తిరిగి అమ్ముకునే పరిస్థితి లేదు. దీంతో పాపిరెడ్డి మూడో తరగతి చదువుతున్న తన పెద్ద కొడుకు గోపాలకృష్ణకి ఆటో డ్రైవర్ల సాయంతో డ్రైవింగ్ నేర్పించారు.
దీంతో బాలుడు ఒక పక్క బడికి వెళ్తూనే మరోపక్క ఆటో నడుపుతూ తన తల్లిదండ్రుల వ్యాపారానికి సహాయ పడుతున్నారు. ఆ బాలుడు స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికొచ్చి తన తండ్రి పాపిరెడ్డిని ఆటోలో ఎక్కించుకుని గ్రామాల్లో తిప్పుతూ పప్పు దినుసులు విక్రయించడంలో సహాయపడుతూ ఉండేవాడు. అయితే, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్, పప్పు దినుసుల మీద వచ్చే అరకొర ఆదాయం సరిపోవడం లేదని, కుటుంబ పోషణ భారంగా ఉందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని దంపతులు కోరుతున్నారు.