ఒకరికి ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ప్రియురాలికి దూరంగా ఉండటం అతనికి ఇష్టం లేదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన ప్రియురాల్ని ఏకంగా పదకొండేళ్లు పాటు ఒక గదిలో దాచుకున్నాడు. ఆమెకు చిన్న సమస్య కూడా కలగకుండా ప్రేమగా చూసుకున్నాడు.
పాలక్కాడ్ జిల్లాలోని ఓ గ్రామంలో రెహమాన్, సజిత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. రెహమాన్ తన ప్రియురాలు సజిత ఇంటికి కొద్ది దూరంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2010 ఫిబ్రవరి 2వ తేదీన రహస్యంగా సజితాను ఇంటికి తీసుకు వచ్చాడు.
ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. ఇంట్లో ఉన్న ఓ చిన్న గదిలో సజితను ఉంచాడు. ఆ గదికి ఉన్న కిటికీ ని తొలగించి రహస్యంగా ఒక డోర్ ఏర్పాటు చేశాడు. ఇక గది తలుపులు ఉన్న గడియాకు విద్యుత్ ప్రసరించేలా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ తలుపు గడియాను ఎవరు పట్టుకున్న విద్యుత్ షాక్ తగులుతుంది. ఇదంతా తన ప్రియురాలు ఆ గది లో ఉందన్న విషయం ఎవరికి తెలియకుండా ఉండటం కోసం రెహమాన్ ఈ ప్లాన్ చేశాడు.
అలా 2010 నుంచి ఈ ఏడాది మార్చి వరకు సజిత ఆ గదిలోనే ఉంది. రెహమాన్ ఇంట్లో అమ్మ నాన్నతో పాటు చెల్లి ఉన్నప్పటికీ సజిత అక్కడ ఉన్నట్లు మాత్రం ఎవరికీ తెలియదు. అయితే సజిత అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ గ్రామం తో పాటు సమీప గ్రామాలను గాలించారు. చాలా మందిని విచారించారు, చివరికి రెహమాన్ ను కూడా విచారించారు.
ఇంట్లో ఎవరికీ తెలియకుండా రెహమాన్ తన ప్రియురాలిని తీసుకొని వితునస్సేరి గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. అయితే రెహమాన్ అదృశ్యం పై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి రెహమాన్ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టిన పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
సజిత కూడా అక్కడే ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత రెహమాన్ చెప్పిన వివరాల ప్రకారం పదకొండేళ్లుగా సజిత ఉన్న గదిని కూడా పోలీసులు పరిశీలించారు. ఈ కేసులో రెహమాన్ మరియు సజితను కోర్టులో హాజరుపరచగా వారిద్దరూ కలిసి ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రెహమాన్, సజిత సంతోషం వ్యక్తం చేశారు.