పాత 5 రూపాయల నోట్ ఉంటె మీకు లక్షల రూపాయలు వస్తాయంటూ కేటుగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. దీంతో నష్టపోయిన బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా కూడా మోసం చేయవచ్చా అనేలా ఉంది ఈ సంఘటన. ఆ మోసగాళ్లను గుర్తించలేని ఓ రైతు 8 లక్షలకు పైగానష్టపోయాడు.
కామారెడ్డి జిల్లా కు చెందిన కస్తూరి నరసింహులు అనే రైతు ఇరవై రోజుల క్రితం యూట్యూబ్ లో ఒక వార్తను చూశాడు. పాత ఐదు రూపాయల నోటు, అందులో టాక్టర్ బొమ్మ ఉన్న నోటు మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అనే వీడియో నరసింహులు చూశారు. అది చూసిన వెంటనే నరసింహులు వారికి ఫోన్ చేశాడు.
వారు మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న నోటు ఉందా అని అడగగా నరసింహులు ఉండని చెప్పడంతో వారు అతనితో మీకు 11.74 లక్షలు వస్తాయని చెప్పారు. దాని కోసం మీరు ఒక ఎకౌంటు ని తీయాల్సి ఉంటుంది, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి లక్ష రూపాయలు అకౌంట్ లో వేయించుకున్నారు.ఆ తర్వాత ఎం ఓ సి, ఐటి అంటూ ఇరవై రోజుల వ్యవధిలోనే మొత్తం 8.35 లక్షల రూపాయలను వారి అకౌంట్ లో జమ చేశాడు రైతు నరసింహులు.
చివరగా జిఎస్టి కోసం 2.34 లక్షలు చెల్లించవలసి ఉంటుందని చెప్పగా ఆ డబ్బులు తీసుకొని ఎస్బిఐ బ్యాంకు కి వెళ్లాడు. అనుమానం వచ్చిన sbi సిబ్బంది నరసింహులను మేనేజర్ వద్దకు పంపించగా అయన నరసింహులతో ఇలా అన్నాడు. ఇంత పెద్ద అమౌంట్ జిఎస్టి కోసం కట్టిన సందర్భాలు ఇప్పటివరకు లేవు, దీనిలో ఏదో మోసం ఉందని చెప్పడంతో నరసింహులు దేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.