విశాఖలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకి పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ఒక శాపంగా మారుతుంది. కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషించే లోపే, బ్లాక్ ఫంగస్ కేసుల టెన్షన్ పట్టుకుంది.
జిల్లాలో బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారి సంఖ్య వారం రోజుల నుండి క్రమంగా పెరుగుతూ వస్తుంది. గడిచిన రెండు రోజుల్లో 20 మంది బ్లాక్ ఫంగస్ లక్షణాలతో కేజీహెచ్ హాస్పటల్ లో చేరారు. అధికారులు వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసులు సంఖ్య వందకు దగ్గరగా ఉన్నాయి. వైద్యులు వారందరికీ కేజీహెచ్ హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ బారినపడిన మరో ఇద్దరికీ కేజీహెచ్ వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించింది. వారిలో ఒక మహిళ మరియు పురుషుడు ఉన్నారు. ఒకరికి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించగా, మరొకరికి వైద్యులు కంటిని తొలగించి ముక్కు లోపల ఉన్న ఫంగస్ ను తొలగించారు.