దేశంలో కరోనా వ్యాప్తి తీరు అందరికి ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా కొత్త కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ మద్రాస్ పరిశోధకులు ఊరటనిచ్చే కబురు అందించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ తీరు తెలిపే ఆర్-వాల్యూ తగ్గుముఖం పడుతున్నట్లు వారు వెల్లడించారు.
జనవరి 14 నుంచి 24 వరకు ఆర్- వాల్యూ 1.57గా నమోదైనట్లు వెల్లడించారు. మరో 14 రోజుల్లో అంతే ఫిబ్రవరి 6 నాటికి దేశంలో కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకుంటుందని పరిశోధకులు వెల్లడించారు. జనవరి 7 నుంచి 13 మధ్య ఆర్- వాల్యూ 2.2గా, 1 నుంచి 6 తేదీల మధ్య ఆర్- వాల్యూ 4గా, డిసెంబర్ 25 నుండి 31 మధ్య ఆర్- వాల్యూ 2.9గా ఉంది.
క్రమంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు ఐఐటీ మద్రాస్ పరిశోధనలో తేలింది. ముంబైలో ఆర్- వాల్యూ 0.67గా, ఢిల్లీలో ఆర్- వాల్యూ 0.98గా, చెన్నైలో ఆర్- వాల్యూ 1.2గా, కోల్కతాలో ఆర్- వాల్యూ 0.56గా ఉండి. దీన్ని బట్టి చూస్తే ముంబై, కోల్కతాలో కోవిడ్ విజృంభన ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నట్లు స్పష్టమైంది.
ఢిల్లీ, చెన్నై లో మాత్రం ఇంకా భారీ స్థాయిలో కేసులు రావాల్సి ఉందన్నారు. వైరస్ సోకిన వ్యక్తి ఎంతమందికి వ్యాప్తి చేస్తారు అనేదే ఆర్- వాల్యూ గా లెక్కిస్తారు. ఉదాహరణకు ఈ విలువ ఒకటి ఉంటే కరోనా సోకిన వ్యక్తి ఇంకొకరికి అంటిస్తారు. సాధారణంగా ఆర్- వాల్యూ 1 దాటితే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే అంటే వంద మందికి కరోనా ఉంటే వారు మరో వంద మందికి పైగా వైరస్ వ్యాప్తి చేస్తారు. ఆర్- వాల్యూ విలువ పెరిగేకొద్దీ వైరస్ కేసులు పెరుగుతాయి.