తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ల నిలిపివేత పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చా అంబులెన్స్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈపాస్లు ఉన్నా లేకపోయినా రాష్ట్రంలోకి అనుమతించాలా చర్యలు చేపట్టింది.
రాష్ట్ర సరిహద్దుల్లో ఆంబులెన్స్ నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనితో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను పోలీసులు అనుమతించడంతో రోగుల బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి పాసులు లేకుండా కరోనా బాధితుల అంబులెన్స్ లను అనుమతిస్తున్నారు.
హైదరాబాద్ కి వస్తున్న అంబులెన్స్లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు అంటూ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వెంకట కృష్ణారావు దాఖలుచేసిన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. అంబులెన్స్లను నిలిపివేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా తమ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. అంబులెన్స్ లను నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో రూపంలో కూడా ప్రయత్నం చేయకూడదు అని ఆదేశించింది. హాస్పిటల్లో చేరేందుకు కంట్రోల్ రూమ్ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.