గోపీచంద్ ‘తొలివలపు’ అనే సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. అయితే, హీరోగా కంటే జయం, నిజం, వర్షం సినిమాలతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ హీరోగా యజ్ఞం సినిమా తో వరస విజయాలు అడ్డుకున్నారు.
ప్రస్తుతం హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘సీటీమార్’ చిత్రంతో గోపీచంద్ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో “పక్కా కమర్షియల్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుంది.
ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి గోపీచంద్ విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా రాజమౌళి సినిమాలో విలన్ అని తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే గోపీచంద్ విలన్ గా కనిపించబోతున్నాడు.
గోపీచంద్ గతంలో మహేష్ బాబు తో కలిసి తేజ దర్శకత్వం వహించిన ‘నిజం’ సినిమా లో విలన్ గా నటించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి జక్కన్న సినిమా లో తలపడనున్నారు. అంతే కాదు, ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర చాలా పవర్ ఫుల్ ఉంటుందని చెప్తున్నారు. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఈ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత జక్కన్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.