రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్ క్రీడా ప్రపంచంలో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఒలింపిక్స్ లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు ఇలా అరెస్టు అవడంతో క్రీడా అభిమానులను తీవ్రంగా కలవరపెడుతుంది. అంత మంచి పేరు ఉన్న రెజ్లర్ ఈ హత్య కేసు వివాదంలో ఎలా ఇరుక్కున్నాడు..?
అసలైన పహిల్వాన్ అంటే రెజ్లర్ సుశీల్ కుమారే. అలాంటి వ్యక్తి తన శిష్యుడు సాగర్ ను హత్య చేశారనే ఆరోపణలపై కొన్నాళ్లపాటు పరారయ్యాడు. రెజ్లర్ సుశీల్ కుమార్ పై పోలీసులు లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. ఎట్టకేలకు సుశీల్ కుమార్ పోలీసులకు దొరికి జైలు పాలయ్యాడు.
సుశీల్ కుమార్ కు ఢిల్లీలో మోడల్ టౌన్ లో ఒక ఇల్లు ఉంది, అందులో రెజ్లర్ సాగర్ కుమార్ కొన్నాళ్ళు అద్దెకు ఉన్నాడు. అతను అద్దె సరైన సమయానికి ఇవ్వకపోవడంతో సుశీల్ మరియు సాగర్ కు మధ్య గొడవ మొదలైంది.
సాగర్ ను ఖాళీ చేయడానికి సుశీల్ ఎంతో ప్రయత్నించాడు. చివరికి సాగర్ 4 నెలల క్రితం ఆ ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి వెళ్ళాడు. సాగర్ ఆ తర్వాత నుంచి సుశీల్ కుమార్ ను అందరి ముందు తిట్టడం మొదలుపెట్టాడు. సాగర్ తిట్టడం తో సుశీల్ కు తీవ్రంగా కోపం వచ్చింది, దీంతో సుశీల్ కొంతమందితో కలిసి మే 4వ తేది అర్ధరాత్రి సాగర్ మరియు అతని బృందం పై హాకీ మరియు క్రికెట్ బ్యాట్ లతో దాడి చేశారు.
పోలీసులు అక్కడికి వెళ్లేసరికి సాగర్ మరియు అతని బృందం తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నారు. తీవ్రగాయాలతో ఉన్న ముగ్గురిని హాస్పిటల్కు తాలించారు. వారిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పోలీసులు సుశీల్ ను అరెస్టు చేశారు. మొత్తం మీద చాలా మంది రెజ్లర్ లకు ఆరాద్యుడుగా ఉన్న సుశీల్ కుమార్ ఇమేజ్ ఇప్పుడు దెబ్బతింది.