ఆస్ట్రేలియా తూర్పు తీర ప్రాంతాన్ని వరదలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. విరిగి పడుతున్న చెట్లు, నీటమునిగిన ఇల్లు, దెబ్బతిన్న రోడ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ను హల్ చల్ చేస్తున్నాయి.
ఈ స్థాయిలో వరదలు రావడం 50 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.ఆ దేశ రాజధాని సిడ్నీ తో పాటు దానికి ఆనుకొని ఉన్న న్యూస్ ఆఫ్ వేల్స్, క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రాలు వరద ధాటికి విలవిలలాడుతున్నాయి. 50 ఏళ్ల తర్వాత భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు.
ఇప్పటికే సిడ్నీ,న్యూస్ ఆఫ్ వేల్స్,క్వీన్స్ ల్యాండ్ నుంచి 18 వేల మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకైతే వరదల బారిన పడి మరణాలు ఏమి నమోదు కాలేదని వారు చెప్పారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో సిడ్నీలోని హాక్స్ బెర్రీ, నేపియన్ నదులు ఉగ్రరూపం దాల్చాయి.
సిడ్నీలోనే నేపియన్ నది ఉన్నది అయితే దాని సాధారణ ప్రవాహ స్థితి కంటే 13 మీటర్ల ఎత్తున ప్రవహిస్తుంది. ఈ నదికి 1961 తర్వాత ఇంత భారీ స్థాయిలో వరదలు రావటం ఇదే మొదటిసారి.సిడ్నీ లో ఉన్న పర్రమత్త నదిలో కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. వరదలు, కుండపోత వానలు కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిలిపివేశారు. విమాన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వరద బీభత్సంతో ఆస్ట్రేలియా ప్రధాని స్పందించారు.
సిడ్నీ రేడియో స్టేషన్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ దేశానికి మరో పరీక్షా సమయం వచ్చింది అని అన్నారు దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించారు. గురువారం దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనితో ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశారు.