గత ఏడాది పదో తరగతి పాస్ అయిన విద్యార్థుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం పదో తరగతి విద్యార్థులతో పాటు గత సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ‘ఆల్ పాస్’ కు బదులు గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
పోటీ పరీక్షల్లో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆల్ పాస్ విధానాన్ని సవరించి గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. 2019–20 సంవత్సరంలో విద్యార్థులకు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొని వారికి ఇప్పుడు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఆ సంవత్సరంలో మొత్తం 3- ఫార్మేటివ్ పరీక్షలు మరియు 1- సమ్మేటివ్ పరీక్షా జరిగింది. దీంతో 3- ఫార్మేటివ్ పరీక్షలకు 20 మార్కుల చొప్పున 60 మార్కులుగా, సమ్మేటివ్ పరీక్షకు 40 మార్కులుగా పరిగణలోకి తీసుకొని గ్రేడ్లు ఇవ్వనున్నారు.